SCERT AP 10th Class Social Study Material Pdf 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Studies 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బ్రాకెట్టు ముందున్న వ్యాఖ్యానానికి సంబంధించి అనువైన వ్యాఖ్యానం / వ్యాఖ్యానాలను బ్రాకెట్టు లోపల ఉన్నవాటి నుంచి గుర్తించండి. (AS1)
అ) రాజకీయ సమానత్వాన్ని దీనితో గుర్తించవచ్చు (ఏ పాఠశాలలోనైనా ప్రవేశం పొందే హక్కు, ఒక వ్యక్తి – ఒక ఓటు అన్న సూత్రం, దైవారాధన ప్రదేశంలోకి ప్రవేశించే హక్కు)
ఆ) భారతదేశ విషయంలో అందరికీ వయోజన ఓటు హక్కు అంటే (అందరినీ ఏదో ఒక రాజకీయ పార్టీకి ఓటు వెయ్యటానికి అనుమతించటం, అందరినీ ఎన్నికలలో ఓటు వెయ్యటానికి అనుమతించటం, అందరినీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యటానికి అనుమతించటం)
ఇ) కాంగ్రెస్ ఆధిపత్యం దీని వల్ల సాధ్యమయ్యింది (విభిన్న సిద్ధాంతాలు ఉన్న వాళ్లని ఆకర్షించగలగటం, ఎన్నికల తరువాత అత్యధిక శాసన సభా స్థానాలను గెలుచుకోగలగటం, ఎన్నికలలో పోలీసు బలగాన్ని ఉపయోగించుకోగలగటం)
ఈ) అత్యవసర పరిస్థితి ఫలితంగా (ప్రజల హక్కులకు పరిమితులు విధింపబడ్డాయి. పేదరికం తొలగింపబడింది. అన్ని రాజకీయ పార్టీల ఆమోదం పొందింది)
జవాబు:
అ) ఒక వ్యక్తి – ఒక ఓటు అన్న సూత్రం
ఆ) అందరినీ ఎన్నికలలో ఓటు వెయ్యటానికి అనుమతించటం
ఇ) విభిన్న సిద్ధాంతాలు ఉన్న వాళ్లని ఆకర్షించగలగటం
ఈ) ప్రజల హక్కులకు పరిమితులు విధింపబడ్డాయి.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 2.
స్వాతంత్ర్యం వచ్చిన తొలి సంవత్సరాలలో సామాజిక-ఆర్థిక మార్పు తీసుకురావటానికి ఏ చర్యలు చేపట్టారు? (AS1)
జవాబు:
రాజ్యాంగ సభ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, హోదా, అవకాశాలలో సమానత్వాన్ని కోరుకుంది. కొత్త రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన నెల రోజులకు ప్రణాళికా సంఘాన్ని ఏర్పరిచారు. మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం మీద కేంద్రీకరించి ఆహార ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించబడింది. వ్యవసాయ రంగంలోని మార్పును నెహ్రూ కేవలం ఆర్ధిక అంశంగా చూడలేదు, దానిని గ్రామీణ రంగ రాజకీయ, సామాజిక, ఆర్ధిక మార్పుగా పరిగణించాడు. కావున సామాజిక – ఆర్థిక మార్పు తీసుకురావడానికి నెహ్రూ ఈ క్రింది చర్యలను చేపట్టినాడు. ప్రధానంగా మూడు అంశాలున్నాయి.
అవి :

  1. భూసంస్కరణలు
  2. వ్యవసాయ సహకార సంఘాలు
  3. స్థానిక స్వపరిపాలన

1) భూసంస్కరణలు :
మూడు రకాలైన భూసంస్కరణలను నెహ్రూ ప్రతిపాదించాడు.
ఎ) జమిందారీ వ్యవస్థ రద్దు
బి) కౌలు విధానాల సంస్కరణ
సి) భూ పరిమితి విధానాలు

ఈ మూడు సంస్కరణల ముఖ్య ఉద్దేశం దున్నే వానికి, భూమి చెందేలా చూసి మరింత ఉత్పత్తి చెయ్యటానికి ప్రోత్సహించటం.

2) వ్యవసాయ సహకార సంఘాలు :
సహకార సంఘాల ద్వారా ఆర్థికంగా లాభసాటి పరిమాణాన్ని చేరుకోవటమే కాకుండా విత్తనాలు, ఎరువులు, రసాయనాలు వంటి విలువైన ఉత్పాదకాలను అందించాలి.

3) స్థానిక స్వపరిపాలన :
భూసంస్కరణలు అమలు అయ్యేలా చూసి, గ్రామ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా సహకార సంఘాలు నడిచేలా చూస్తాయి.

మొదటి పంచవర్ష ప్రణాళికలో పెద్ద ఆనకట్టలు కట్టి విద్యుత్తు ఉత్పత్తి, సాగునీటి కల్పనల ద్వారా వ్యవసాయాన్ని వృద్ధి చేయుటపై దృష్టి సారించారు. ఆనకట్టల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు వృద్ధి చెందాయి. దేశం ప్రగతి సాధించాలంటే పరిశ్రమలను అభివృద్ధి చేసి, ఎక్కువ మంది కర్మాగారాలలోనూ, సేవారంగంలోనూ పనిచేసేలా మళ్లించాల్సిన అవసరం ఉందని ప్రణాళిక కర్తలు గుర్తించి, రెండవ పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రాధాన్యత పరిశ్రమల వైపునకు మళ్లించారు.

ప్రశ్న 3.
ఒక పార్టీ ఆధిపత్యం అంటే ఏం అర్థం చేసుకున్నారు? అది ఎన్నికలలో మాత్రమే ఆధిపత్యమా, లేక సిద్ధాంత భావజాలంలో కూడా ఆధిపత్యమా? మీ కారణాలను పేర్కొంటూ చర్చించండి. (AS1)
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1952, 1957, 1962 లలో జరిగిన మొదటి మూడు సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. భారతదేశానికి జవహర్‌లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అయ్యాడు. ఇతర పార్టీలలో ఏ ఒక్క పార్టీకి కూడా 11% మించి ఓట్లు రాలేదు. కాంగ్రెస్ 70% పైగా స్థానాలను గెలుచుకుంది. ఈ విధంగా కాంగ్రెస్ ఆధిపత్యం ఒక ఎన్నికలలోనే కాదు, సిద్ధాంత, భావజాలంలో కూడా కొనసాగుతుంది.

కాంగ్రెస్ ఆధిపత్యానికి కారణాలు :

  1. 1952, 1957, 1962 లలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 45% ఓట్లతో విజయం సాధించి అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
  2. స్వాతంత్ర్యానికి ముందు కాంగ్రెస్ నాయకత్వం మితవాదుల చేతులలో ఉండేది. తరువాత అతివాదులు, చిట్ట చివరికి గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ పనిచేసింది. జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్ లక్ష్యం దేశ స్వాతంత్ర్యం అవటం వల్ల ఈ సంస్థలో విభిన్న సిద్ధాంతాలు ఉన్న వ్యక్తులందరూ పనిచేశారు. అందువల్ల ఈ సంస్థకు బహుతావాద దృక్పథం ఏర్పడింది.
  3. స్వాతంత్ర్యం తరువాత రాజకీయ పార్టీగా మారిన వాతావరణంలో కూడా ఈ బహుతావాద దృక్పథాన్ని కాంగ్రెస్ వదులుకోలేక పోయింది. ఇందులో వామపక్షవాదులు, సంప్రదాయవాదులు, మితవాదులు అందరూ ఉన్నారు. విభిన్న శక్తులకు ఆశ్రయం కల్పించింది.
  4. కాంగ్రెస్ లో ఎల్లప్పుడూ అంతర్గతంగా చిన్నచిన్న బృందాలు ఉండేవి. ఈ బృందాలు నాయకుల మధ్య పోటీ కారణంగా ఏర్పడ్డాయి. పార్టీ లక్ష్యాలతో వీళ్లు ఏకీభవించినప్పటికీ కొన్ని విధానాల విషయంలో విభేదాలు ఉండేవి.
  5. సభ్యుల ప్రయోజనాలను బట్టి ఈ బృందాలు వివిధ అంశాలపై వేరు వేరుగా స్పందించేవి. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ విభిన్న దృక్పథాలు, ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా కనిపించేది. కొన్ని సందర్భాలలో ఈ బృందాలు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి నాయకత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి ప్రయత్నించేవి.
  6. ఏకపార్టీ ఆధిపత్యంలో ఉన్న పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లోపలే రాజకీయ పోటీ ఉంటూ ఉండేది. అయితే ఇతర పార్టీలు పోటీ చేశాయి. కానీ కాంగ్రెస్ ను సవాలు చేయగలిగే సంఖ్యలో స్థానాలను గెలుచుకోలేకపోయాయి.

ఇతర రాజకీయ పార్టీలు క్రమేపి బలం పుంజుకుని రెండు దశాబ్దాల కాలంలో అధికారానికి పోటీదారుగా ఎదిగాయి.

ప్రశ్న 4.
ఐక్యత సాధించే అంశంగానో లేక విభజించే దానిగానో భారతదేశ రాజకీయాలలో భాష కేంద్ర బిందువుగా అనేకసార్లు తెరమీదకు వచ్చింది. ఈ ఘటనలను గుర్తించి వాటిని వివరించండి. (AS1)
జవాబు:
కొత్తగా ఏర్పడిన దేశం ఎదుర్కొన్న మొదటి సవాళ్లలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలన్న కోరిక ఒకటి మరియు 1963లో అధికార భాషా చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీకి వ్యతిరేకంగా తమిళనాడు ఉద్యమాన్ని చేపట్టింది. ఈ విధంగా భాష అనేది భారతదేశంలో అనేక సందర్భాలలో కీలకమైన పాత్ర వహించింది.
1) బ్రిటిష్ కాలంలో దేశం ప్రెసిడెన్సీలు (కలకత్తా, మద్రాస్, బాంబే)గానూ, సెంట్రల్ ప్రావిన్సెస్, బీదర్ వంటి అనేక పెద్ద రాష్ట్రాలుగానూ విభజింపబడి ఉండేది. దేశంలో అధికభాగం అనేక సంస్థానాల కింద ఉంది. ఈ రాష్ట్రాలలో పలు భాషలు మాట్లాడే ప్రజలు కలసి జీవిస్తున్నారు. ఒకే భాషను మాట్లాడుతూ పక్క పక్క ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలంతా ఒక రాష్ట్రంగా సంఘటితపరచాలంటూ కోరసాగారు. వీటితో సంయుక్త కర్ణాటక (మద్రాసు, మైసూరు, బాంబే, హైదరాబాదులలో కన్నడ మాట్లాడే ప్రజలను కలుపుతూ) సంయుక్త మహారాష్ట్ర, మహా గుజరాత్ ఉద్యమం, ట్రావెన్ కోర్-కొచ్చిన్ సంస్థానాల విలీనం, సిక్కులకు పంజాబ్ రాష్ట్రం వంటి కోరికలు ఉండేవి. అయితే మతం ఆధారంగా దేశ విభజన జరగడంతో నాయకులు ఆ భాషా ప్రాతిపదిక రాష్ట్రాలను పున్వ్యవస్థీకరిస్తే దేశం ముక్కలు కావటానికి దారితీస్తుందని భయపడసాగారు.

2) తెలుగు మాట్లాడే ప్రజలు అన్నిటికంటే తీవ్రంగా ఉద్యమాన్ని చేపట్టారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలకు అనుగుణంగా కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని అమలు చెయ్యాలని వాళ్లు పట్టుపట్టారు. బ్రిటిష్ పాలనలో కూడా ఆంధ్ర మహాసభ క్రియాశీలంగా ఉండి మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలను ఒక్క తాటి కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. ఈ ఉద్యమం స్వాతంత్ర్యం తరువాత కూడా కొనసాగింది. విన్నపాలు, దరఖాస్తులు, వీధులలో కవాతులు, నిరాహారదీక్షలు వంటి పద్ధతులను ఇందుకు ఉపయోగించారు.

3) 1963లో అధికార భాషా చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీని మిగిలిన దేశం మీద రుద్దడానికి ఎత్తుగడగా భావించి, డి.ఎం.కె తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా సమ్మెలు, ధర్నాలు, హర్తాళ్ లు నిర్వహించారు. దిష్టిబొమ్మలు, హిందీ పుస్తకాలు, చివరికి రాజ్యాంగంలోని పేజీలను కూడా తగలబెట్టారు. ‘సైన్ బోర్డులలో హిందీలో ఉన్న దాని మీద చాలా చోట్ల నలుపు రంగు పూశారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఈ అల్లర్లను పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది.

ఈ విధంగా జనాదరణ పొందిన ఈ భాషా ఉద్యమాల వల్ల ప్రభుత్వం తన అధికారిక స్థానాన్ని పునః సమీక్షించుకోవలసి వచ్చింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు, హిందీ వ్యతిరేక ఉద్యమాలలో ప్రధానమంత్రులు పరిస్థితులు చేజారిపోకుండా తమ దృక్పథాన్ని మార్చుకున్నారు. సమస్యలను పరిష్కరించడం జరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 5.
1967 ఎన్నికల తరువాత రాజకీయ వ్యవస్థలో వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏవి? (AS1)
జవాబు:
భారతదేశ చరిత్రలో 1967 ఎన్నికలు చాలా కీలకమైనవి. ఎన్నికలను ప్రజలు అత్యంత ప్రధానమైనవిగా పరిగణిస్తున్నారని, వాటికి తమదైన ఉనికి ఉందని ఈ ఎన్నికలు రుజువు చేశాయి.

ముఖ్యమైన మార్పులు:

  1. స్వాతంత్ర్యం తరువాత కాంగ్రెస్ తక్కువ ఆధిక్యత (284 స్థానాలు) తో ఎన్నికయింది. కాంగ్రెస్ పార్టీ అంతకు ముందెన్నడూ చవిచూడని ఫలితాలను చవిచూసింది.
  2. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మద్రాస్, కేరళ శాసనసభలలో కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది.
  3. తమిళనాడు, కేరళలో కూడా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. తమిళనాడులో డి.ఎం.కె. ఘనవిజయం సాధించింది. ప్రజాదరణ ఉన్న సినిమా హీరో ఎం.జి. రామచంద్రన్ మద్దతును డి.ఎం.కె. ఉపయోగించుకుంది.
  4. పశ్చిమబెంగాల్, ఒరిస్సాలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది.
  5. ఈ ఓటములతో కాంగ్రెస్ ఆంతరంగికంగా బలహీనపడింది. ఉత్తరాది రాష్ట్రాలలో స్వల్ప విజయాలు పొందిన చోట్ల దాని ప్రతినిధులు ప్రతిపక్షాలకు ఫిరాయించారు. ఫలితంగా కాంగ్రెస్ పడిపోయి ‘సంయుక్త విధాయక దళ్ (ఎస్వీడి) ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
  6. భారత రాజకీయ చరిత్రలో ఈ కొత్త ప్రభుత్వాలు ఒక మైలురాయిగా ఉంటాయి. ఒక విధంగా ప్రజాస్వామిక తిరుగుబాటును ఇది సూచిస్తుంది. మధ్యస్థాయి కులాలు భూసంస్కరణల వల్ల ప్రయోజనం పొంది, ఆర్ధికంగా లాభపడి, మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని పొందాయి.
    ఉదా : హర్యానా, ఉత్తరప్రదేశ్ లో జాట్, బీహార్ లో కుర్మి, ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి, కమ్మ. ఈ కులాలు ఆయా రాష్ట్రాలలో ఆధిపత్య కులాలు.
  7. దేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ భావాలు తిరిగి ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. దీనికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నాయకత్వం వహించారు.
  8. 1969లో అసోంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలలో ‘మేఘాలయ’ అన్న కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.
  9. 1966లో ఏర్పడిన పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా చండీఘర్ ని తమకు ఇమ్మని 1968-69లలో పంజాబ్ ప్రజలు ఆందోళనలు చేశారు.
  10. మహారాష్ట్రలో బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలన్న వింత వాదన మొదలయ్యింది. దీనికి ‘శివసేన’ నాయకత్వం వహించింది.
  11. బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లలో అనేక సమస్యలు తలెత్తాయి.

1967 ఎన్నికల తరువాత, పార్టీ లోపలి, పార్టీ బయట నుండి వచ్చే సమస్యలను ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎదుర్కొంది.

ప్రశ్న 6.
రాష్ట్రాలను ఏర్పరచటానికి మరొక ఆధారం ఏమైనా ఉందా? భాష ఆధారంగా పునఃవ్యవస్థీకరణ కంటే అది ఏ విధంగా మెరుగైనదిగా ఉండేది? (AS1)
జవాబు:
రాష్ట్రాలను ఏర్పరచటానికి భాష కాకుండా “భౌగోళికంగా” పునర్వ్యవస్థీకరిస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకనగా –
1) భాష ఆధారంగా పునర్వ్యవస్థీకరణ మూలంగా ఇటీవలి కాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం.
ఉదా : తెలంగాణ ఉద్యమం. భాషా ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటికి తెలంగాణా వాదులు మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమం చేస్తున్నారు.

2) భౌగోళికంగా రాష్ట్రాలను విభజించినట్లయితే భాషాపరంగా వచ్చే సమస్యలు వచ్చేవి కావు. భౌగోళికంగా విభజించినప్పుడు ఆ ప్రాంతంలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ భాషలు మాట్లాడే ప్రజలుంటారు. కావున ప్రత్యేకంగా ఒక అంశం ఆధారంగా ఉద్యమాలు జరగకపోవచ్చు.

కావున నా అభిప్రాయం ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ భాషాపరంగా, కులాల, మతాల ప్రాతిపదికగా కాకుంటే, భౌగోళికంగా జరిగివుంటే బాగుండేది.

ప్రశ్న 7.
ఇందిరాగాంధి తీసుకున్న ఏ చర్యలను ‘వామపక్ష పంథా వైపు మళ్లించటం’గా పేర్కొన్నారు? అందుకు ముందు దశాబ్దాల విధానాలతో పోలిస్తే ఇవి ఏ విధంగా భిన్నమైనవి? ఆర్థికశాస్త్ర అధ్యాయాల ఆధారంగా ప్రస్తుత విధానాలకూ, వాటికీ తేడా ఏమిటో పేర్కొనండి. (AS1)
జవాబు:
1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో విజయం సాధించింది. “గరీబీ హటావో” అన్న జనాకర్శక నినాదంతో ఇందిరాగాంధీకి ప్రజాదరణ మరింత పెరిగింది. ప్రతిపక్షం అన్నది లేకుండా పోయింది. కాని ఇందిరాగాంధీ చేపట్టిన కొన్ని చర్యల మూలంగా వామపక్ష పంథావైపు మళ్లించటమనేది జరిగింది.

  1. 1973లో అరబ్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో చమురు ధరలు ఎన్నడూ లేనంతగా పెరగటంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది.
  2. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆహార కొరత, నిరుద్యోగం వంటివి ప్రభావం చూపసాగాయి.
  3. సామాజిక, ఆర్ధికమార్పు సాధించాలన్న లక్ష్యంతో అనేక ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తూ, చేసిన చట్టం, రాజ భరణాలను రద్దు చేస్తూ చేసిన చట్టాల విషయంలో, సామాజిక, ఆర్ధిక మార్పు అన్న పేరుతో రాజ్యాంగాన్ని తరచు సవరిస్తున్నారని, అది వాస్తవానికి దాని స్వరూపాన్ని మార్చివేస్తుందని, భిన్న వ్యవస్థాగత నిర్మాణాల మధ్య ప్రస్తుతం ఉన్న సమతౌల్యం దెబ్బతింటోందని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. దీని మూలంగా రాజ్యాంగ సవరణకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలకు కొంతవరకు పరిమితులు విధింపబడ్డాయి.
  4. ప్రజలలో అధికశాతం సంతోషంగా లేరు. దీంతో ప్రతిపక్షాలకు అవకాశం దొరికింది. దేశ వివిధ ప్రాంతాలలోని అసంతృప్తిని ఆసరా చేసుకోసాగారు. జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ఐక్యమైన ప్రతిపక్షాలు దేశంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ కి ప్రత్యేకించి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించాయి.

1971 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ రికార్డుస్థాయిలో విజయం సాధించింది. ఇందిరాగాంధీకి ప్రజాదరణ పెరిగింది. పేదలు, అట్టడుగు ప్రజలతో తాను, తమ పార్టీ మమేకం కావటం ద్వారా పార్టీకి కొత్త సామాజిక మద్దతులను కూడగట్టటానికి ఆమె ప్రయత్నించింది. 1971 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తరువాత ఇందిరాగాంధీ అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ అంచెలంచెలుగా అధికార కేంద్రీకరణ గావించింది. ఇది వామపక్షాల ఆవిర్భావానికి కారణమైంది.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 8.
భారత ప్రజాస్వామ్యాన్ని అత్యవసర పరిస్థితి ఏ విధంగా వెనక్కి తీసుకుపోయింది? (AS1)
జవాబు:
అత్యవసర పరిస్థితిలో శాంతిని కాపాడే పేరుతో పౌరహక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం అనేక తీవ్రమైన చట్టాలను చేసింది.

  1. దేశంలో శాంతి, భద్రతలకు అవసరమంటూ ప్రభుత్వం అనేక అణిచివేత చర్యలకు పాల్పడింది.
  2. అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేశారు.
  3. ఏ కారణం లేకుండా అరెస్టు చెయ్యటం, హింసించటం, పౌర హక్కులకు భంగం కలిగించటం వంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి.
  4. అత్యవసర పరిస్థితి కాలంలో ధరల నియంత్రణ, నల్లబజారు, వెట్టిచాకిరీలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలను ప్రజలు స్వాగతించారు.
  5. ఈ కాలంలో చేపట్టిన మురికివాడల తొలగింపు, జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించటం వంటి కార్యక్రమాలు ప్రజల కోపానికి కారణమయ్యాయి. అయితే పౌరహక్కులు లేనందు వల్ల ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు లేకపోయాయి. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ప్రభుత్వానికి లేకుండా పోయింది.

శాంతి, భద్రతలు నెలకొల్పటానికి, దేశ సమగ్రతను కాపాడటానికి అత్యవసర పరిస్థితి అవసరమయ్యిందని ప్రభుత్వం సమర్థించుకుంది.

ప్రశ్న 9.
అత్యవసర పరిస్థితి కాలంలో ఏ విధమైన వ్యవస్థాగత మార్పులు వచ్చాయి? (AS1)
జవాబు:
అత్యవసర పరిస్థితి కాలంలో కొన్ని వ్యవస్థాగత మార్పులు జరిగినాయి. అవి :

1) రాజ్యాంగానికి 42 వ సవరణ జరిగింది. ఈ సవరణ అనేక మార్పులను తీసుకువచ్చింది. ఈ సవరణలోని అంశాలు:
ఎ) ఎన్నికల వివాదాలలో న్యాయస్థానాలకు చోటు లేకుండా చెయ్యటం.
బి) రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచటం.
సి) సామాజిక, ఆర్థిక మార్పునకు ఉద్దేశించిన చట్టాలకు న్యాయస్థానాల నుంచి సాధ్యమైనంత రక్షణను కల్పించటం.
డి) న్యాయవ్యవస్థ పార్లమెంటుకు లోబడి ఉండేలా చేయటం.

2) ఈ 42 వ సవరణతో “లౌకిక, సామ్యవాద” అనే పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. తద్వారా భారతదేశం మత ప్రమేయం లేని దేశమని, సామ్యవాద దేశమని ప్రకటించడం జరిగింది.

3) ఈ సవరణ ఉద్దేశాలుగా దేశ సమైక్యతను బలపరచటం, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని న్యాయస్థానాల నుంచి కాపాడటం వంటి వాటిని పేర్కొన్నప్పటికీ వాస్తవంలో దీని వల్ల దేశ ప్రజాస్వామ్య స్వభావం బలహీనపడిందని చెప్పవచ్చు.

10th Class Social Studies 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) InText Questions and Answers

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 1.
ప్రజలందరికీ ఓటు హక్కు లేకపోతే మనది ప్రజాస్వామిక దేశమని చెప్పుకోటానికి వీలు ఉండేదా?
జవాబు:
ప్రజలందరికీ ఓటు హక్కు లేకపోతే మనది ప్రజాస్వామిక దేశమని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి మూలం ఎన్నికలు, అందరికీ ఓటు హక్కు ఉండడం. కావున ఓటు హక్కు లేకపోతే మనది ప్రజాస్వామ్యమని చెప్పలేము.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 2.
భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి?
జవాబు:
భారతదేశంలో ప్రస్తుతం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 3.
మీరు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే 1970 లకి ముందు సహకార సంఘాల వంటి సంస్థలను స్థాపించారేమో తెలుసుకోండి. దాంట్లో సభ్యులుగా ఎవరు ఉన్నారో తెలుసుకోండి.
జవాబు:
మా గ్రామంలో 1970కి ముందు “వ్యవసాయ సహకార సమితి” ఉంది. అందులో సభ్యులుగా గ్రామంలో ఉన్నత కుటుంబాలకు చెందినవారు ఉండేవారని మా తాత గారిని అడిగి తెలుసుకున్నాను.

10th Class Social Textbook Page No.256

ప్రశ్న 4.
జాతీయభాష అవసరం ఉందా?
జవాబు:
అవును. జాతీయ భాష అవసరం ఉంది.

10th Class Social Textbook Page No.256

ప్రశ్న 5.
అన్ని భాషలకు సమాన హోదా ఉండాలా?
జవాబు:
అవును. అన్ని భాషలకూ సమాన హోదా ఉండాలి.

10th Class Social Textbook Page No.248

ప్రశ్న 6.
సామాజిక సమానత్వాన్ని సాధించామని మీరు అనుకుంటున్నారా? సామాజిక సమానత్వాన్ని, అసమానత్వాన్ని సూచించే మీకు ఎదురైన ఉదాహరణలను పేర్కొనండి.
జవాబు:

  1. కుల, మత, వర్గ, స్త్రీ పురుష, ధనిక, పేద వంటి తారతమ్యాలు లేకుండా అందరికి సమాన న్యాయం, స్వాతంత్ర్యం స్వేచ్ఛలను రాజ్యాంగం కల్పించింది. ఇది సమసమాజాన్ని చూపిస్తుంది.
  2. ప్రభుత్వ అవకాశాలలో కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద భేదాలు చూపకుండా అందరికి సమాన అవకాశాలున్నాయి. స్త్రీ, పురుష ఉద్యోగులకు ప్రభుత్వం సమాన వేతనాలు చెల్లిస్తుంది. ఎటువంటి విచక్షణ చూపదు. ఇది సమానత్వాన్ని సూచిస్తుంది.
  3. అయినప్పటికీ కూడా ఇంకా కుల వ్యవస్థకు సంబంధించి గ్రామాలలో వివక్ష ఎక్కువగా కనిపిస్తుంది. లింగ వివక్ష కూడా కొనసాగుతున్నది. ఇది అసమానత్వాన్ని సూచిస్తుంది.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 7.
ఎన్నికలను, ప్రత్యేకించి ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోవటాన్ని నిరక్షరాస్యత ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు?
జవాబు:

  1. పాశ్చాత్య దేశాలలో ప్రజలు ఓటుహక్కును దశలవారీగా పొందారు. మన దేశంలో 1935 లో కేవలం 10% ప్రజలకే “ఓటు హక్కు ఉండేది. అయితే స్వాతంత్ర్యం తరువాత భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి వయోజనులందరికీ ఓటు హక్కును కల్పించడం జరిగింది.
  2. కానీ నిరక్షరాస్యత మూలంగా మొదటి సాధారణ ఎన్నికలు ప్రభుత్వానికి సవాలుగా పరిణమించాయి.
  3. నిరక్షరాస్యత సమస్యను అధిగమించడానికి ఎన్నికల సంఘం రాజకీయపార్టీ అభ్యర్థులను సూచించేలా రోజువారీ జీవితం నుండి కొన్ని గుర్తులను ఉపయోగించుట జరిగింది. ప్రజలు తమకు నచ్చిన గుర్తు ఉన్న డబ్బాలో తమ ఓటును వేశారు. ఈ రకంగా ఎన్నికల సంఘం నిరక్షరాస్యతను అధిగమించింది.

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 8.
భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి ఉండకపోతే దేశ ఐక్యతకు మరింత మేలు జరిగి ఉండేదా?
జవాబు:
అవును, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడకపోతే ఆయా ప్రాంతాలలో అనేక భాషలు మాట్లాడేవారు, అనేక కులాలు, మతాల ప్రజలు ఉండేవారు. అందరూ కలసిమెలసి జీవించటం మూలంగా వారిలో ఐకమత్యం కలిగేది. తమకు ప్రత్యేక ప్రాంతం కావాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని, ప్రత్యేక దేశం కావాలని పోరాటాలు, ఉద్యమాలు జరిగేవి కాదు. తద్వారా దేశ ఐక్యతకు మేలు జరిగేదని నా అభిప్రాయం.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 9.
ఆ సమయంలో గిరిజన భాషలను ఎందుకు పట్టించుకోలేదు?
జవాబు:

  1. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది అనేక భాషోద్యమాల ఫలితంగా జరిగింది. కావున భాషాప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
  2. గోండి, సంథాలి లేదా ఒరావన్ వంటి భాషలను గిరిజన ప్రజలు మాట్లాడతారు. సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న గిరిజనుల భాషను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదనుకొని ఉంటారు.
  3. సమాజంలో శక్తిమంత ప్రజానీకం మాట్లాడే తమిళం, తెలుగువంటి భాషలను పరిగణనలోకి తీసుకున్నారు.

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 10.
భారతదేశంలో ఇటీవల ఏర్పడిన కొత్త రాష్ట్రాలు ఏవి, అవి ఎప్పుడు ఏర్పడ్డాయి?
జవాబు:
ఈ మధ్య కాలంలో భారతదేశంలో నాలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అవి –

  1. ఛత్తీస్ గఢ్ : ఇది 01-11-2000 న రాష్ట్రంగా ఏర్పడింది.
  2. ఉత్తరాంచల్ : ఇది 09-11-2000 న రాష్ట్రంగా ఏర్పడింది. (ఇది ప్రస్తుతం ఉత్తరాఖండ్ గా వ్యవహరించబడుతోంది.)
  3. జార్ఖండ్ : ఇది 15-11-2000 న రాష్ట్రంగా ఏర్పడింది.
  4. తెలంగాణ : ఇది 02-6-2014 న 29వ రాష్ట్రంగా ఏర్పడింది.

10th Class Social Textbook Page No.256

ప్రశ్న 11.
భాషా విధానం జాతి ఐక్యత, సమగ్రతలకు ఎలా దోహదపడింది?
జవాబు:
భారతదేశం విశాలమైనది. ఇక్కడ వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ భాషలు మాట్లాడే ప్రజలున్నారు. ఆ కావున వారందరికి, స్వంత సంస్కృతి, స్వంత భాష ఉండడం మూలంగా, తాము ప్రత్యేక జాతి అనే భావన రావచ్చు. కానీ జాతీయ భాష ఉన్నట్లయితే దేశంలో ఉండే ప్రజలందరికి ఆ భాష వర్తిస్తుంది. కాబట్టి తామంతా ఒకటే అని, ఒకే జాతి అనే భావన కలిగి దేశ సమగ్రతకు, ఐక్యతకు దోహదపడుతుంది.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 12.
మహిళలలో అక్షరాస్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్లకు ఓటు హక్కు కల్పించకుండా ఉంటే అది మన విధానాలను – ఎలా ప్రభావితం చేసి ఉండేది?
జవాబు:
మహిళలకు ఓటు హక్కు కల్పించకుండా ఉంటే అది మన విధానాలను చాలా ప్రభావితం చేసి ఉండేది.

అవి :

  1. స్త్రీ, పురుష వివక్ష చూపించినట్లు కనిపించేది. అప్పుడు రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వానికి అర్థంలేదని అన్పించేది.
  2. అందరికీ ఓటు హక్కు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. మనది ప్రజాస్వామ్యమని చెప్పలేము.
  3. స్త్రీలకు ఓటు లేకపోతే వారికి ‘రాజకీయ హక్కు లేనట్లే’ ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలగడమే. మన దేశ పౌరులందరికి, వారి సర్వతోముఖాభివృద్ధికి ప్రాథమిక హక్కులను కల్పించామని చెప్పుకోవడానికి వీలు లేదు.
  4. సామ్యవాద దేశమని చెప్పుకోవడానికి వీలు లేదు.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 13.
క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించటం అన్నది ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పామనటానికి స్పష్టమైన సంకేతం. ఈ వ్యాఖ్యానంతో మీరు ఏకీభవిస్తారా? కారణాలను పేర్కొనండి.
జవాబు:
అవును. ఏకీభవిస్తాను. అందుకు కారణాలు :

  1. మన దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ప్రజాప్రతినిధులు ఎవరైనా రాజీనామా చేసినా లేదా ఇంకే కారణాల వలన అయినా వారి స్థానాలు ఖాళీ అయితే ఆరు నెలల లోపు తిరిగి ఎన్నికలు నిర్వహించి ఆ స్థానాలను భర్తీ చేస్తున్నారు.
  2. భారతదేశంలో జాతి, మత, కుల, వర్గ, స్త్రీ, పురుష, ధనిక, పేద అనే విచక్షణ లేకుండా వయోజనులైన ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించారు. కాబట్టి మనది ప్రజాస్వామ్యమే.
  3. ఎన్నికల ద్వారా ఎక్కువ మంది మద్దతు ఉన్న ప్రజాప్రతినిధులచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కావున మనది

10th Class Social Textbook Page No.251

ప్రశ్న 14.
రాజకీయ వ్యవస్థలో కాంగ్రెసు ఆధిపత్యానికి దోహదం చేసిన కారణాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:

  1. స్వతంత్ర సమర పార్టీ కాంగ్రెస్. స్వతంత్రం తరువాత కూడా కాంగ్రెస్ కు ప్రాధాన్యత కొనసాగింది.
  2. కాంగ్రెస్ లో విభిన్న సిద్ధాంతాలు ఉన్న వ్యక్తులందరూ పనిచేశారు. అందువల్ల కాంగ్రెస్ కు బహుతావాద దృక్పథం ఏర్పడింది.
  3. బహుతావాదం మూలంగా వామపక్షవాదులు, సంప్రదాయవాదులు, మితవాదులు, ప్రతిపక్ష, అధికార పార్టీలు ఉన్నాయి. అందువల్ల అత్యధిక మందిని ఆకర్షించి ఆధిపత్య పార్టీగా కొనసాగింది.
  4. 1952, 1957, 1962 ఎన్నికలలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి, మిగతా పార్టీలను నామమాత్రమైన వాటిగా చేసి, ఏకపార్టీగా నిలిచింది.
  5. మిగతా పార్టీలు కాంగ్రెస్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయాయి. మొదటి మూడు సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ కు 45% ఓట్లు రాగా, ప్రతిపక్షాలకు 11% ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో కాంగ్రెస్ కు ఎదురులేకుండా పోయింది.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Textbook Page No.254

ప్రశ్న 15.
తొలి దశాబ్దాల నాటి వయోజన విద్యాతరగతులకు సంబంధించిన ఫోటో. ఈ పథకాలతో సమాజంలో అభివృద్ధి లేదా మార్పులకు సంబంధించిన భావాలు ఎలా వ్యక్తం అవుతున్నాయో చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 1
జవాబు:

  1. నిరక్షరాస్యత యొక్క సమస్యను ఎదుర్కొనుటకు ఆ రోజుల్లోనే ప్రభుత్వం వయోజన విద్యా తరగతులను నిర్వహించేదని తెలుస్తుంది.
  2. మొదటి సార్వత్రిక ఎన్నికలలో నిరక్షరాస్యత మూలంగా ఎదుర్కొన్న సమస్యలు మళ్ళీ ఎదుర్కోకూడదని, తాము చదువు నేర్చుకోవాలి అనే పట్టుదల వారిలో కనిపిస్తుంది.
  3. నిరక్షరాస్యత మూలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు తమ పిల్లలు ఎదుర్కోకూడదని తమ పిల్లలకు చదువు నేర్పిస్తున్నట్లు తెలుస్తుంది.

10th Class Social Textbook Page No.255

ప్రశ్న 16.
భారతదేశంలో చేపట్టిన భూసంస్కరణలను చైనాలోనూ, వియత్నాంలోనూ చేపట్టిన వాటితో పోల్చండి.
జవాబు:
భారతదేశంలోని భూసంస్కరణలు, వియత్నాంలోని భూసంస్కరణలు ఈ కింది విధంగా ఉన్నాయి.

భారతదేశంలో భూసంస్కరణలు వియత్నాంలో భూసంస్కరణలు
1) భూసంస్కరణలకు సంబంధించిన ప్రస్తావన ముందుగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించింది. 1) వియత్నాంలో కూడా భూసంస్కరణలను కమ్యూనిస్ట్ పార్టీయే ప్రారంభించింది.
2) భారతదేశంలో భూసంస్కరణలను అమలుచేసి, అంతకు ముందు ఉన్న పాత విధానాలను (జమీందారీ, కౌలు) రద్దు పరచినారు. 2) ప్రభుత్వం భూసేకరణ చేసి దానిని పేద రైతులకు పునః పంపిణీ చేసింది.
3) భూసంస్కరణలు భారతదేశం అంతటా అమలు జరిగాయి. 3) వియత్నాంలో భూసంస్కరణలు కేవలం ఉత్తరభాగంలో మాత్రమే అమలు జరిగాయి.